ఐటి రంగంపై నెలకొన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం పటాపంచలు చేసింది. ఐటి రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలకు ముప్పు ఉందనే వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిసారేసింది. ఐటి ఉద్యోగాలకు అనసర భయాలు వద్దని ఐటి శాఖ స్పష్టం చేసింది. భారత దేశంలో ఐటి పరిశ్రమ అభివృద్ధి పథంలో ఉందని చెప్పింది. ఉద్యోగాలపై భారీ స్థాయిలో కోతలు ఉంటాయని అనవసర భయాలు పెట్టుకోవద్దని ఐటి శాఖ పేర్కొంది. ఈ సెక్టార్ 8-10శాతం గ్రోత్ నమోదు చేస్తుందని ఐటీ సెక్రటరీ అరుణ సుందర రాజన్ చెప్పారు. గత రెండున్నరేళ్లలో 5లక్షల ఉద్యోగాలను ఐటీ పరిశ్రమ కల్పించిందని ఇది ఇకముందు కూడా కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఐటీలో నియామకాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. క్లౌడ్,బిగ్ డేటా, డిజిటల్ చెల్లింపులు రావడంతో ఐటీ ఉద్యోగ ప్రొఫైల్ మార్పు చెందుతోందని సుందరరాజన్ తెలిపారు. వార్షిక రివ్యూలో భాగంగానే ఈ తీసి వేతలని, కానీ ఈ ఏడాది హఠాత్తుగా ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని అనుకోవడం పూర్తిగా తప్పు అని ఐటి కార్యదర్శి చెప్పారు.
విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్ర లాంటి కంపెనీల్లో భారీ ఉద్యోగాల కోత ఆందోళన రేపింది. దీనితో ఐటి ఉద్యోగాల విషయంలో తీవ్ర అనుమానాలు రెకెత్తాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఐటి ఉద్యోగులకు ఊరట నిచ్చింది.