ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు యాదవ సంఘం ప్రకటించింది. చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన యాదవ సంఘాలు ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశాయి. దీనిపై స్పందించిన చాగంటి కోటేశ్వరరావు తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఎవరి మనసును గాయపర్చే ఉద్దేశం తనకు లేదని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. చాగంటి వివరణ తరువాత ఆయన్ను కలిసిన యాదవ సంఘాల నేతలు చాగంటి వివరణతో సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ వివాదాన్ని ఇంతటితో వదలివేయాలనే భావిస్తున్నట్టు వారు చెప్పారు. తమకు చాగంటి పై ఎటువంటి వ్యతిరేకతా లేదని అయితే ఆయన తన ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యాలు బాధించాయని వారన్నారు. చాగంటిపై తమకు భక్తిభావం ఉందని ఎప్పటిలాగానే ఆయన తన ప్రవచనాలను కొనసాగించాలని తాము కోరుతున్నట్టు వారు పేర్కొన్నారు.